అమరపు సత్యనారాయణ – ప్రముఖ రంగస్థల నటుడు

అమరపు సత్యనారాయణ అప్పటి శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి తాలూకా పాములవలస గ్రామంలో అప్పలనాయుడు, కన్నమ్మలకు 1937 ఏప్రిల్ 12 న జన్మించారు. చిన్నతనంలో పాటలు,పద్యాలు గొంతెత్తి అందరూ వినెలా పాడేవారు. అతని కంఠ మాధుర్యాన్ని గుర్తించి పక్కి సత్యన్నారాయణ అనే ఉపాధ్యాయుడు శిక్షణనిస్తే మంచి కళాకారుడవుతాడని చేరదీసాడు. ఒకవైపు నాటకాల్లో అవకాశాలిస్తూ మరొకవైపు నోము సూర్యారావు వద్ద శిక్షణ యిప్పించాడు. పద్యం భావయుక్తంగా పాడటానికి సంగీతం చాలా అవసరమని అందులో శిక్షణ పొందారు. శ్రావ్యమైన కంఠం,చూడచక్కని రూపం,భావాత్మక గానం ఆయనను అందరిలో మేటిగా నిలిపింది. ఆయన ఏ పాత్ర ధరించవలసి వచ్చినా ఆహార్యం ,ముఖ కవలికలు మొదలుకొని అన్ని విషయాలలో ప్రత్యేక శ్రద్ధ వహించెవారు.నిండుతనం కోసం పరితపించెవారు.అందువల్ల ఆయన పాత్రలకి,ఆయనకు ప్రజాదరణ పెరిగింది. అపరపు సత్యనారాయణ అనేక పాత్రలు ధరించినా ఆయనకు కొన్ని పాత్రలతొ విడదీయరాని సంబంధం పెరిగింది.ముఖ్యంగా రామాంజనేయ యుద్ధంలో రాముడు, గయోపాఖ్యానం నాటకంలో కృష్ణుడు, అర్జునుడు, చింతామణి నాటకంలో బిల్వమంగళుడు పాత్రలు మంచి ఆదరణ పొందాయి. 20.10.2012 న రాజాం లో కన్ను మూశారు.
అవార్డులు,రివార్డులు,సన్మానాలు
1960 లో ఆంధ్ర రాష్ట్ర పరిషత్ పోటీల్లో స్వర్ణ పతకం పొందారు.
1965 లో పొద్దుటూరుకు చెందిన శ్రీ రాయన నాటక పరిషత్ వారిచే స్వర్ణ కిరీటం పొందారు.
రూర్కెలా లోని శ్రీ వెంకటేశ్వర ఫైనాంస్ సంస్థ ‘నాటక కళా విశారదా అనే బిరుదుతో సత్కరించింది.
అప్పటి గవర్నర్ పి.సి.అలెగ్జాండర్ చేతుల మీదుగా ‘రాఘవ అవార్డు ‘ అందుకున్నారు.

ప్రతిష్టాత్మక బళ్ళారి రాఘవ అవార్డు గ్రహీత అమరపు సత్యనారాయణ .
అప్పటి సినీ నటులైన కాంతారావు,ధూళిపాళ,అల్లురామలింగయ్య,చంద్రమోహన్,రాజనాల వంటివారితో కలసి రంగస్థలం పై నటించారు.    గయో పాఖ్యానంలో అర్జునుడు, కర్ణసందేశంలో కర్ణుడు పాత్రల సంభాషనలు రికార్డులు తయారయ్యాయి.
వృత్తి పరంగా రాజాం నందు కళాశాల ఉపన్యాసకులుగా పనిచేసి పదవీవిరమణ పొందినా జన హృదయాలలో శాశ్వతంగా నిలిచి పోయారు.ఆంధ్రా యూనివర్శిటీ రంగస్థల కళల విభాగంలో విజిటింగ్ ఫ్యాకల్టీగా పనిచేశారు. నటనా రంగంలో అనేక మంది శిష్యులను తయారు చేసి, నాటకరంగ అభివృద్ధికి విశేష కృషి చేశారు.